ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు: రేవంత్ రెడ్డి

  • దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని మాత్రమే ప్రార్థించగలమని వ్యాఖ్య
  • కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిందని ఆగ్రహం
  • తండాలలో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అని వ్యాఖ్య
ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించు గాక అని మాత్రమే ప్రార్థించగలమన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని, ఇందుకు కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదన్నారు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తామని తెలిపారు. తండాలకు విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల ఇళ్లకు తాగు నీరు ఇవ్వలేదని ఆరోపించారు. తండాలకు 100 శాతం రోడ్లు వేయాలని నిర్ణయించామన్నారు. తండాలు, గూడాల్లో అభివృద్ధి జరిగితేనే అసలైన అభివృద్ధి అన్నారు. ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారలేదని విమర్శించారు. 

కాగా, అంతకుముందు నిరుద్యోగుల సమస్యలపై ఉభయ సభల్లో వాయిదా తీర్మానం కోరుతూ బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనతోపాటు ఇతర న్యాయ పరమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి, నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వ అణచివేత వైఖరిపై చర్చ చేపట్టాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌కు కేటీఆర్‌ ఈ నోటీసు ఇచ్చారు.

Revanth Reddy
Congress
Telangana Assembly Session

More Telugu News